కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా

  • విజయవాడ మేయర్ కు లేఖ అందజేత
  • వ్యక్తిగత కారణాల వల్లేనని పేర్కొన్న శ్వేత
  • టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు వెల్లడి
విజయవాడ కార్పొరేటర్, ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం ఉదయం విజయవాడ కార్పొరేషన్ కు వెళ్లిన శ్వేత.. అక్కడ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. 

అంతకుముందు విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఇంటికి వెళ్లి ఆయనతో శ్వేత భేటీ అయ్యారు. ఎమ్మెల్యే నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు తెలియజేయాలనే ఉద్దేశంతో కలిశానని చెప్పారు. గద్దె రామ్మోహన్ తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలిపారు.

ఎమ్మెల్యే నివాసం నుంచి నేరుగా విజయవాడ కార్పొరేషన్ కు చేరుకున్న శ్వేత.. మేయర్ కు రాజీనామా లేఖ ఇచ్చి ఆమోదించాలంటూ కోరారు. కాగా, కూతురు రాజీనామా విషయాన్ని ఎంపీ కేశినేని నాని ముందుగానే వెల్లడించారు. ఈమేరకు సోమవారం ఉదయం ఆయన తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు. కార్పొరేటర్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తుందని వివరించారు.

Kesineni Swetha
Vijayawada
Corporator
Resignation
TDP

More Telugu News